ఆషాఢంలో కొత్త దంపతులకు దూరం ఎందుకంటే..?

ఆషాఢం వ‌చ్చిందంటే కొత్త‌గా పెళ్లయిన జంట‌కు తంటే !! ఎందుకంటే ఆషాఢ‌మాసంలో వారిని క‌లిసి ఉండ‌నివ్వ‌రు. కొత్త‌గా పెళ్లయిన‌ అమ్మాయిని అత్తాగారింట్లో ఉండ‌నివ్వ‌కుండా పుట్టింటికి పంపించేస్తారు. మ‌ళ్లీ శ్రావ‌ణ మాసం వ‌చ్చాకే తిరిగి అత్తారింటికి తీసుకొస్తారు. ఇలా ఆషాఢంలో భార్యాభ‌ర్త‌లను దూరంగా ఉంచ‌డానికి పెద్ద కార‌ణ‌మే ఉంది? ఆషాఢంలో పెళ్లిళ్లు చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం కూడా అదే? ఆ కార‌ణ‌మేంటంటే..

ఆషాఢ మాసంలో వాతావ‌ర‌ణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటుంటాయి. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డ‌టం ద్వారా బ్యాక్టీరియా, వైర‌స్‌లు పెరిగి అంటువ్యాధులు ఎక్కువ‌గా వ‌స్తుంటాయి. ఇలాంటి స‌మ‌యంలో కొత్త పెళ్లి కూతురు గ‌ర్భం దాలిస్తే పుట్ట‌బోయే బిడ్డ‌పై ఆ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది. ఎందుకంటే పిండానికి తొలి మూడు నెల‌లు చాలా కీల‌క‌మైన స‌మ‌యం.

ఆ స‌మ‌యంలోనే అవ‌య‌వాలు ఏర్ప‌డ‌టం మొద‌ల‌వుతుంది. ఇలాంటి స‌మ‌యంలో త‌ల్లి అంటువ్యాధుల బారిన ప‌డితే క‌డుపులోని బిడ్డపై కూడా ఆ ప్ర‌భావం ప‌డుతుంది. అది కాకుండా ఆషాఢంలో గ‌ర్భం వ‌స్తే.. మండు వేస‌విలో కాన్పు ఉంటుంది. అంటే ఆ ఎండ తీవ్ర‌త‌ను త‌ల్లీ బిడ్డ ఇద్ద‌రూ త‌ట్టుకోలేరు.

దీంతో ఇద్ద‌రికీ అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందుకే ఆషాఢంలో కొత్త‌గా పెళ్ల‌యిన భార్యాభ‌ర్త‌ల‌ను దూరంగా ఉంచుతారు. అదీకాకుండా పెళ్ల‌యిన కొత్త‌లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య విప‌రీత‌మైన ప్రేమ‌, ఆక‌ర్ష‌ణ ఉంటాయి. అలాంటి స‌మ‌యంలో నెల రోజుల పాటు దూరం ఉంటే.. ఎడ‌బాటు వ‌ల్ల క‌లిగే బాధేంటో వారికి అర్థ‌మ‌వుతుంది. దీంతో వాళ్లు జీవితాంతం అన్యోన్యంగా ఉంటార‌ని అలా చేస్తారు.

Leave a Reply