Mahalakshmi Scheme | ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కొటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. తాజాగా, రూ.500లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం (ఫిబ్రవరి 27న) ప్రారంభిస్తోంది. ఈ నేపథ్యంలో మహిలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి వారికి విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే గ్యాస్ కనెక్షన్ మహిళల పేరుమీద ఉండాలని గైడ్లైన్స్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. పథకం అమలు కోసం గడిచిన మూడేళ్ల గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనున్నట్టు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది.
జీవో ప్రకారం..
గ్యాస్ సబ్సిడీ పొందేందుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి
మహిళల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లకే వర్తింపు
మూడేళ్ల సగటు వినియోగం ఆధారంగా ఏటా ఇచ్చే సబ్సిడీ సిలిండర్లపై నిర్ణయం
ముందుగా మొత్తం ధరను చెల్లించి తీసుకోవాలి.. 48 గంటల్లో సబ్సిడీ మొత్తం బ్యాంకులో జమ