RK Roja: పిల్లలు పుట్టరన్నారు.. కానీ ఆ దేవుడి దయతో అలా జరిగింది ఎమోషనలైన మంత్రి ఆర్కే రోజా

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రోజా. ఆతర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, స్పెషల్‌ రోల్స్‌తో ఆకట్టుకుంది. జబర్దస్త్‌ లాంటి కామెడీ షోలతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని కూడా చూరగొంది. అలా సినిమా ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోజా ఇప్పుడు తన సమయాన్ని పూర్తిగా రాజకీయాలకే కేటాయించారు. ఏపీ పర్యాటక శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఆమె ప్రస్తుత పాలిటిక్స్‌లో ఫైర్‌బ్రాండ్‌గా కొనసాగుతున్నారు.

ప్రత్యర్థులపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే రోజా- ఆర్కే సెల్వమణిలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. చామంతి సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడిన వీరు ఆతర్వాత పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. వీరి వైవాహిక బంధానికి గుర్తింపుగా అన్షుమాలిక్ అనే కుమార్తె, కృష్ణ కౌశిక్‌ అనే కుమారుడు ఉన్నారు. కాగా రోజాకున్న అనారోగ్య సమస్యల కారణంగా ఒకనొక సందర్భంలో ఆమెకు పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పారట.

అయితే భగవంతుని దయ వల్ల తనకు అమ్మనయ్యే అవకాశం దక్కిందంటున్నారు. ఈ విషయాన్ని రోజానే బయటపెట్టారు.ఓ ఛానెల్‌ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన వృత్తి, వ్యక్తిగత జీవితాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.‘ఫ్యామిలీ విషయాల్లో నేను చాలా ఎమోషనల్‌. ఎందుకంటే నాకు ఫైబ్రాయిడ్‌ సమస్య ఉంది. పిల్లలు పుట్టరని వైద్యులు చెప్పేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత 2000 సంవత్సరంలో లాప్రోస్క్రోపీ సర్జరీ జరిగింది.

ఇది జరిగిన రెండేళ్లకు అంటే 2002లో మా పెళ్లయింది. 2003లో నాకు పాప (అన్షు మాలిక్‌) పుట్టింది. అయితే గర్భం దాల్చగానే ఆ విషయాన్ని మా డాక్టర్‌కు చెప్పాను. ఆమె ఎగిరి గంతేసింది. నీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. అందుకే నిన్ను కరుణించాడని హర్షం వ్యక్తం చేసింది. అసలు పిల్లలు పుట్టే అవకాశం లేదు అనుకుంటున్న సమయంలో అన్షు నా కడుపున పుట్టింది. అందుకే నాకు పాపంటే ప్రాణం.. నా ఇద్దరు పిల్లలకు వారికి నచ్చినట్లే వారి జీవితాలు ఉండాలనుకుంటాను’ అంటూ ఎమోషనలయ్యారు రోజా. ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

Leave a Reply