Tangella Uday | కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాకినాడ పార్లమెంటు సభ్యుడిగా జనసేన పార్టీ నుంచి ఉదయ్ పోటీ చేయనున్నారని ఆయన తెలిపారు. తన కోసం ఆయన సీటును త్యాగం చేసిన ఉదయ్ కు కాకినాడ పార్లమెంటు సీటును ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పొత్తులో భాగంగా… కాకినాడ ఎంపీగా ఉదయ్ పోటీ చేస్తారని ఆయన తెలిపారు. కాకినాడ ఎంపీ సీటు పొత్తుల్లో భాగంగా జనసేనదేనని ఆయన చెప్పుకొచ్చారు.
ఉదయ్ ఈ స్థానం నుంచి పోటీ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం తనకుందని ఆయన అన్నారు. ఉదయ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.ఉదయ్ గురించి విశేషాలు చూస్తే మనోడు సామాన్యుడు కాదు అనే రేంజిలో ఉన్నాయి. దుబాయ్ లో కళ్లు చెదిరే జీతంతో కూడిన ఉద్యోగాన్ని వదిలేసి, భారత్ వచ్చి ‘టీ టైమ్’ పేరిట దేశవ్యాప్తంగా టీ షాపుల చెయిన్ ప్రారంభించి, కోట్ల రూపాయల టర్నోవర్ తో యువ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందాడు.
ఉదయ్ 2006లో హైదరాబాదులోని టీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజి నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పట్టా అందుకున్నాడు. ఆ తర్వాత పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. చివరిసారిగా దుబాయ్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. ఖరీదైన జాగ్వార్ కారు, లగ్జరీ విల్లా… ఇలా అక్కడ ఎంతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాడు. అయితే, 29 ఏళ్ల వయసులో సొంతంగా ఏదైనా సాధించాలన్న తపనతో ఉద్యోగం వదిలేశాడు.
లక్షల్లో వేతనం అందుకుంటున్న దశలో ఒక్కసారిగా ఉద్యోగం మానేయడంతో అతడి కుటుంబం ఏమాత్రం హర్షించలేకపోయింది. భారత్ వచ్చిన అనంతరం టీ టైమ్ పేరిట దేశవ్యాప్త గొలుసుకట్టు టీ దుకాణాలతో కొత్తగా వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలో ఉదయ్ కు సపోర్ట్ గా నిలిచింది భార్య బకుల్ ఒక్కరే. ఆమె ఓ ఆయుర్వేదిక్ డాక్టర్. భార్య ప్రోత్సాహంతో వ్యాపార రంగంలోకి దిగిన ఉదయ్ అనుకున్నది సాధించారు.