ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆయనతో తనకున్న తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 100 సంవత్సరాలైనా ఎన్టీఆర్ నేర్పిన క్రమశిక్షణా విధానాలు అందరికీ శిరోధార్యాలే అని..సినిమా కళాకారులకు వారు నిర్దేశించిన ప్రమాణాలు నిరంతరం ప్రాతఃస్మరణీయాలే…అంటూ ట్విట్టర్లో ఎన్టీఆర్ గురించి కొన్ని అంశాలను పంచుకున్నారు.
1990ల్లో చిరంజీవితో విజయశాంతి ఓ సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్ ఏవీఎం స్టూడియోలో జరిగింది. అదే సమయంలో ఎన్టీఆర్.. బ్రహ్మర్షి విశ్వమిత్ర సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు ఏవీఎం స్టూడియోలోనే జరిగాయి. ఇది తెలిసిన విజయశాంతి.. ఎన్టీఆర్ను కలవాలని డబ్బింగ్ థియేటర్కు వెళ్లింది. అక్కడ వెలుతురు సరిగ్గా లేకపోవడంతో విజయశాంతిని ఎన్టీఆర్ గమనించలేదు. దీంతో విజయశాంతి చాలా బాధపడింది.
అయితే ఈ విషయం ఎన్టీఆర్కు తెలిసింది. ఆ విషయం తెలియగానే మరుసటి రోజు ఉదయం 6 గంటలకే మద్రాసులోని విజయశాంతి ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే విజయశాంతి షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న శ్రీనివాస ప్రసాద్కు సారీ చెప్పమని చెప్పారు. డబ్బింగ్ థియేటర్లో అమ్మాయిని చూసుకోలేదు. పొరపాటు జరిగిందని తెలియజేయండని అన్నారు.
అంతేకాదు హైదరాబాద్లో విజయశాంతి ఫోన్ నెంబర్ తెలుసుకుని మరీ కాల్ చేసి సారీ చెప్పారు. పొరపాటు జరిగిందమ్మా.. ఐయామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పారు. అప్పట్నుంచి విజయశాంతి ఎప్పుడు తన ఇంటికి వెళ్లినా ఎన్టీఆర్ స్వయంగా టిఫిన్ వడ్డించేవారు. అదీ సాటి కళాకారులకు సీనియర్ ఎన్టీఆర్ ఇచ్చే గౌరవం. అందుకే ఆ మహోన్నత వ్యక్తిని ఎంత ప్రశంసించినా తక్కువే అని విజయశాంతి అంటున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ వరుస ట్వీట్స్ చేశారు.