Gaddar | తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఉద్యమకారుడు, ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గద్దర్ ను బ్రతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
గద్దర్ మృతి పట్ల తెలంగాణలోని పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్రావు. మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో ఓ నిరుపేద దళిత కుంటుంబంలో 1949 జూన్ 5న శేషయ్య, లచ్చమ్మ దంపతులకు జన్మించారు.
విద్యాభ్యాసం నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్య పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచి పోరాట భావాలు కలిగిన గద్దర్.. తెలంగాణ వెనుకబాటుతనాన్ని, వలస పాలకుల ఆధిపత్యంలో శిథిలమవుతున్న తెలంగాణ జీవనచిత్రాన్ని కళ్లారా చూశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే సమస్యలన్నింటికీ పరిష్కారమని గద్దర్ భావిస్తూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
ప్రజాగాయకుడు గద్దర్ మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఆయన మృతి అణగారిన, అట్టడుగువర్గాలకు తీరని లోటని అన్నారు. తన ఆట, పాటలతో లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు పేర్కొన్నారు.