ఎముకలు ధృడంగా ఉంటేనే వ్యాధులకి దూరంగా ఉండవచ్చు. లేదంటే జీవితంలో పనులు చేయడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎముకలు బలహీనమైతే రికెట్స్, క్యాన్సర్ సంభవించే ప్రమాదం ఉంది. అయితే వైద్య నిపుణలు కొన్ని ఆహారాలు తినడం వల్ల ఎముకలని బలంగా చేసుకోవచ్చని తెలిపారు. వాటి గురించి తెలుసుకుందాం.జీవితంలో ప్రతి దశలోనూ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎముకలను ధృడంగా చేసుకోవడంపై దృష్టి సారించాలి.
అయితే యాక్టివ్గా లేని జీవనశైలి, అనారోగ్యకర ఆహార అలవాట్లు పెరగడంతో ప్రజలు ఎముకల బలహీనం సహా బోన్ సంబంధిత అనారోగ్యాలకు గురవడం పెరుగుతోంది. దీర్ఘకాలం ఎముకల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మున్ముందు ఆస్టియోపోరోసిస్ వంటి తీవ్ర అనారోగ్యాల బారినపడే ప్రమాదం పొంచిఉందని ఆయుర్వేద నిపుణురాలు డాక్టర్ డింపుల్ జంగ్ధా చెప్పుకొచ్చారు.
ఎముకల ఆరోగ్యానికి అశ్వగంధ అద్భుతంగా పనిచేస్తుందని ఆమె సూచించారు.ఇది ఎముక కణజాలాన్ని ఉత్పత్తి చేసే కణాల సంఖ్యను పెంచుతుంది. ఇది వాపును కూడా తగ్గించడంతో పాటు ఎముక మెరుగ్గా కోలుకునేందుకు మార్గం సుగమం చేస్తుందని చెబుతున్నారు. ఇక పసుపు ఎముకలో మినరల్ లాస్ను నిరోధించడంతో పాటు ఎముక సాంద్రతను కాపాడుతుంది.
పసుపును వివిధ వంటకాల్లో వాడటం ద్వారా ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. నువ్వుల నూనె ఎముకలను బలోపేతం చేయడంతో పాటు బోన్ లాస్ను నిరోధిస్తుంది. నువ్వుల నూనెలో ఉండే జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, ఒమెగా-3 ఆమ్లాలు, ప్రొటీన్ ఎముకల సంబంధిత సమస్యలను నివారిస్తాయి.