YS Sharmila | 6 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటన నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆరోపిస్తూ ఛలో సెక్రటేరియట్ కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఉదయం నుంచే ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఛలో సెక్రటేరియట్ ను అడ్డుకునేందుకు పోలీసులు నిన్న రాత్రి నుంచే కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు.
దీన్ని గమనించిన వైఎస్ షర్మిల విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లోనే రాత్రి బస చేశారు.ఉదయం విజయవాడ నుంచి సచివాలయానికి వైఎస్ షర్మిల పాదయాత్రగా బయలుదేరారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి షర్మిల చేపట్టిన పాదయాత్ర..ఏలూరు రోడ్డు మీదుగా చల్లపల్లి బంగ్లా వద్దకు చేరుకుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి షర్మిల మానవహారం నిర్వహించారు.తరువాత చల్లపల్లి బంగ్లా వద్ద వైఎస్ షర్మిల రోడ్డుపై బైఠాయించారు.
పోలీసుల వలయం నుండి తప్పించుకుని షర్మిల… సెక్రటేరియట్ కు వెళ్తున్నారనే సమాచారంతో కరకట్టపై షర్మిలను అరెస్టు చేసేందుకు వందలాది మంది పోలీసులను మోహరించారు. తొలుత కార్యకర్తలు, నాయకులను బలవంతంగా వాహనాల్లో తరలించారు. గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనం ఎక్కించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.